మోదీ 'పిలుపు' బాటలో కమల్‌హాసన్... చిత్ర పరిశ్రమకు కీలక సూచన

  • పశ్చిమాసియా సంక్షోభం చిత్రపరిశ్రమపై కూడా ఉందన్న కమల్ హాసన్
  • ఖర్చు చేసే ప్రతి రూపాయి సినిమాకు ఉపయోగపడేలా ఉండాలన్న కమల్ హాసన్
  • ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అంశంపై చర్చ జరగాలన్న కమల్ హాసన్
నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుందాం అంటూ విలక్షణ నటుడు కమల్ హాసన్ చిత్ర పరిశ్రమకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు కమల్ హాసన్ పిలుపునివ్వడం గమనార్హం. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందని అన్నారు.

ఈ సంక్షోభం కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతోందని అన్నారు. పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా మరికొన్ని నెలల్లో వినోదం కోసం వినియోగదారులు ఖర్చు చేసే విధానాలు మారవచ్చని అన్నారు. ఈ భారం నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, ఇలా వ్యవస్థపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకు కాకుండా సినిమాకు ఉపయోగపడేలా జాగ్రత్తపడాలని సూచించారు. అప్పుడే సినిమా రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో జరిగే ఎలాంటి సవరణ అయినా కార్మికుల వేతనాలు, భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని పేర్కొన్నారు.

ప్రతి ప్రేమకథ ప్యారిస్‌లోనే ఎందుకు పుట్టాలని, స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలని ప్రశ్నించారు. ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదని చురక అంటించారు. మన సినిమా పరిశ్రమ ఇప్పటికైనా ఏకాభిప్రాయానికి రావాలని, ఆర్థిక సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ జరగాలని అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు దీనిపై చర్చించాలని సూచించారు.

Kamal Haasan
Narendra Modi
Indian Film Industry
Movie Production Cost
West Asia Crisis
Economic Challenges

More Telugu News